ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా.. రూ.1800 కోట్లు ఆదాయం..!

AP Wine Shops Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. దీంతో అధికారులు ఫైనల్ డేటాను విడుదల చేశారు. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి మొత్తం 89 వేల 882 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 14వ తేదీన అధికారులు లాటరీ పద్దతి ద్వారా వైన్ షాపులు కేటాయించనున్నారు.

అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం మొత్తం 3396 మద్య దుకాణలను నోటిఫై చేయగా 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది.  దరఖాస్తుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రభుత్వ అంచనాలకు మించి దరఖాస్తు రుసుం ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయం వచ్చింది.

ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దుకాణానికి సరాసరి 25 అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 14న  మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రాల్లో మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీయనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. 

డ్రా పద్ధతిలో దుకాణం దక్కించుకున్న వారు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈనెల 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Leave a Comment